పటాన్ చెరు,జూన్,2,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన యోధులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు గారి నాయకత్వంలో 14 ఏళ్ల పాటు సాగిన మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలను సాకారం చేసింది. ఆనాటి పోరాట స్ఫూర్తితోనే నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములమవుతున్నాం”అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు, పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాలలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

