•బీరంగూడలో ఘనంగా ముగిసిన 4వ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు
•విజేతలకు సొంత నిధులచే రెండు లక్షల రూపాయల నగదు బహుమతులు అందజేత..
అమీన్పూర్ డిసెంబర్ 01
మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని, ఇందుకు తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ బాలాజీ ఫంక్షన్ హాలులో వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 4వ ఓపెన్ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విజేతలకు రెండు లక్షల రూపాయల సొంత నగదు తో నగదు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీలకు పటాన్చెరు వేదికగా నిలవడం సంతోషకరమన్నారు. నేటితరం యువత మొబైల్ ఫోన్లు, డ్రగ్స్, బెట్టింగ్లు, రీల్స్ అంటూ తమ విలువైన యవ్వనాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్యం నుండే పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించడంతోపాటు.. నిరుపేద క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఐదు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని.. పటాన్చెరులో ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలతో మైత్రి స్టేడియం ఆధునికరించడం జరిగిందని గుర్తు చేశారు. స్వతహాగా క్రీడాకారుడైన తాను.. క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. క్రీడ పోటీల నిర్వహకురాలు ఇంటూరి రేఖను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ దేవానంద్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.


