చేగుంట,జూన్,2,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ చేగుంట బ్యాడ్మింటన్ క్లబ్ ప్రతినిధులు ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీకి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.క్రీడాకారుల సౌకర్యార్థం చేగుంటలో ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం ఏర్పాటుకు తమ పాలకవర్గం తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఇక్కడి యువతలో మంచి క్రీడా నైపుణ్యాలు ఉన్నాయని కొనియాడారు. క్లబ్ సభ్యులు కోరిన విధంగా స్టేడియం నిర్మాణానికి 8 గుంటల భూమిని కేటాయించేందుకు గానూ, సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి (ఈవో)తో సమావేశమై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. యువతకు క్రీడా రంగానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను తమ పాలకవర్గం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ క్లబ్ ప్రెసిడెంట్ పి. విష్ణు కుమార్, మాజీ వార్డ్ మెంబర్ ఎర్ర యాదగిరి మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

