చేగుంట,జూన్,2,మెదక్ టుడే న్యూస్:రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని మెదక్ కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో మంచి ప్రతిభను కనబరిచిన పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు దివ్య, భాను శ్రీ,అంకిత లనుమెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గనుల, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సన్మానించడం జరిగింది జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, అడిషనల్ కలెక్టర్ నగేష్, ఏ ఎం ఓ సుదర్శనమూర్తి, డీఎస్ఓ రాజిరెడ్డి, చల్లా లక్ష్మణ్, రేఖ తదితరులు పాల్గొన్నారు.చేగుంట ఎంఈఓ నీరజ, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించడం జరిగింది.
చేగుంట,జూన్,2,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం చేగుంట గ్రామానికి చెందిన చిలక నీల వైఫ్ ఆఫ్ గణేష్ చేగుంట మండల కేంద్రంలో తన ప్లాటకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలు పోగొట్టుకున్నట్లు తెలిపారు.కుమారుడు చిలుక విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తను ప్లాటు అమ్మడానికి మంగళవారం మధ్యాహ్నం తూప్రాన్ వెళుతుండగా బైకుపై వెళుతుండగా ఒరిజినల్ ప్లాట్ పేపర్లు పోయినట్టుగా తెలిపారు.చేగుంటలో పులబోయిన వారి గల్లీలో ఉన్న ప్లాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ నెంబర్: 488, /2008 సంవత్సరం. అని బాధితుడు చిలుక విజయ్ ఆవేదంతో తెలిపారు కావున ఎవరైనా ఈ నెంబర్ గల ఒరిజినల్ ప్లాటు డాక్యుమెంట్ లభించినట్లయితే మానవత దృక్పథంతో ఈ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరని విజయ్ విజ్ఞప్తి చేస్తున్నారు. 9959092629
బీజేపీ కార్యాలయంలో వేడుకలు కాంగ్రెస్, బీఆర్ఎస్పై విమర్శలు బీజేపీకి అవకాశం ఇవ్వాలి మంత్రి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్,జూన్,2,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించినప్పటికీ ఉద్యమ ఆశయాలు, లక్ష్యాలు మాత్రం పూర్తిస్థాయిలో నెరవేరలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం వేలాది మంది యువకులు, విద్యార్థులు పోరాడి ప్రాణత్యాగాలు చేశారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరగలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరకుండా పోయాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపైనా బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి వస్తున్న నిధులను కూడా సమర్థంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్’ లక్ష్యంతో తెలంగాణకు భారీగా నిధులు కేటాయిస్తోందని చెప్పారు. మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు, రైల్వేలు, విద్య, వైద్యం తదితర రంగాల్లో కేంద్రం తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తోందని వివరించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు కొత్త ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాల్సిన సమయం వచ్చిందని బండి సంజయ్ అన్నారు. మోసం చేసిన హస్తం, ద్రోహం చేసిన కారుకు ప్రజలు ఇప్పటికే సమాధానం చెప్పారని పేర్కొన్నారు. కేంద్ర నిధులను సమర్థంగా వినియోగిస్తూ నిజాయితీతో పని చేసే బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని తెలంగాణ సమాజాన్ని కోరారు. తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, రైతుల సంక్షేమం కోసం బీజేపీ కట్టుబడి పనిచేస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు.
గ్రామసభలకు ప్రత్యేక ప్రాధాన్యం ప్రజల్లో అవగాహన కల్పించాలి శాఖల సమన్వయంతో ముందుకు
హైదరాబాద్,జూన్,2,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) రాష్ట్రంలో 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. పర్యావరణ వారోత్సవాల నిర్వహణ, ప్రజా అవగాహన కార్యక్రమాలు, గ్రామసభలు, వార్డు సభల నిర్వహణపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణ వార్డుల్లో గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలు, ప్రజా భాగస్వామ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ సభలను సమర్థవంతమైన వేదికగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు.భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సూచించారు. ఓటరు నమోదు, సవరణ ప్రక్రియలో ప్రతి అర్హ పౌరుడు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఇది కీలకమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలు, ఆదాయాన్ని పెంచే ప్రత్యామ్నాయ పంటలపై రైతులను చైతన్యవంతం చేయాలని చెప్పారు. వర్షాకాల సన్నద్ధత, ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడంతో పాటు మొక్కల నాటకం, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల భాగస్వామ్యం పెంచాలని కోరారు.ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో ఇప్పటికే అమలవుతున్న అంశాలకే కాకుండా గ్రామసభలు, వార్డు సభల ద్వారా అదనపు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సామాజిక నాయకులు, ఇతర వర్గాలను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు.వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పోలీసు శాఖ ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం పెంచాలని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతమైన అమలు, ప్రజా కార్యక్రమాల నిర్వహణకు పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య, కార్మిక శాఖ కార్యదర్శి హరిచందన, వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపీతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.
జూలై 2న భారీ ఉద్యమం జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలి ఉద్యమకారుల హక్కుల కోసం పోరాటం
హైదరాబాద్,జూన్,2,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ, తెలంగాణ ఉద్యమం మరో స్వాతంత్ర్య పోరాటాన్ని తలపించే మహత్తర ఉద్యమమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు పూర్తయినా ఉద్యమ ఆశయాల సాధన ఇంకా పూర్తి కాలేదని అన్నారు. వేలాది మంది యువత, విద్యార్థులు, ఉద్యోగులు తమ భవిష్యత్తును పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాడారని, వారి త్యాగాలను తరతరాలకు గుర్తు చేసే బాధ్యత సమాజంపై ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం జరిగిన ఉద్యమాన్ని ప్రతి కుటుంబం గుర్తుంచుకోవాలని, జూన్ 2ను కేవలం సెలవు రోజుగా కాకుండా ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక పునాదులు వేసిన ప్రొఫెసర్ జయశంకర్ సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించిన కవిత, ఆయన విగ్రహం ఇప్పటికీ రాష్ట్ర రాజధానిలో లేకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ ఆలోచనకు రూపకల్పన చేసిన మహనీయుడైన జయశంకర్కు తగిన గౌరవం ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. ఆగస్టు 6న ఆయన జయంతి నాటికి ట్యాంక్బండ్పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవసరమైతే విగ్రహ నిర్మాణ వ్యయంతో పాటు నిర్వహణ బాధ్యతను కూడా తెలంగాణ జాగృతి భరిస్తుందని స్పష్టం చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం దురదృష్టకరమని కవిత విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి గౌరవం, గుర్తింపు, సంక్షేమం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ అంశాలపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని ఆశించామని, కానీ అలాంటి ప్రకటన రాకపోవడం నిరాశ కలిగించిందన్నారు.ఉద్యమకారుల సమస్యలు, భూముల అంశాలపై ప్రభుత్వం స్పందించకపోతే ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జూలై 2న ఉప్పల్ భగాయత్లో భారీ భూపోరాటం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇది ఏ ఒక్క పార్టీ కార్యక్రమం కాదని, తెలంగాణ భవిష్యత్తు కోసం జరిగే ప్రజా ఉద్యమమని పేర్కొన్నారు. మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, న్యాయవాదులు, ఉద్యమకారులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మిలియన్ మార్చ్ను గుర్తు చేసే స్థాయిలో ఈ భూపోరాటం జరుగుతుందని కవిత పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కనిపించిన ప్రజా చైతన్యాన్ని మరోసారి ప్రదర్శించే సమయం వచ్చిందన్నారు. అమరవీరుల కుటుంబాలకు గౌరవం, ఉద్యమకారులకు గుర్తింపు, తెలంగాణ ఆశయాల సాధన కోసం ఈ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని, ఉద్యమకారులను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని కవిత హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం దక్కే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తూ, తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అమరవీరుల త్యాగాలకు నివాళి సంక్షేమంతో అభివృద్ధి లక్ష్యం ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
ఖమ్మం,జూన్,2,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించిన తెలంగాణను సామాజిక, ఆర్థిక, రాజకీయన్యాయం అందించే ప్రజల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, సమగ్రాభివృద్ధిని కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సాధికారత కార్యక్రమాలు, రైతు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో సామాజిక భద్రతను బలోపేతం చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు భద్రత, గౌరవప్రదమైన జీవనం కల్పించడంలో ఈ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.విద్య, వైద్యం, విద్యుత్, హరిత ఇంధన రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెడుతున్నాయని భట్టి విక్రమార్క వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, ప్రతి యువకుడికి అవకాశం, ప్రతి రైతుకు భరోసా, ప్రతి మహిళకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి ఫలాలు గ్రామీణ ప్రాంతాల వరకు చేరేలా సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోందని భట్టి విక్రమార్క అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమన్వయంతో తెలంగాణను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రజల సహకారం అవసరమని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర చరిత్రలో చిరస్మరణీయమైన రోజని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి, అమరవీరుల త్యాగ స్ఫూర్తితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తూ అభివృద్ధి పథంలో తెలంగాణను ముందుకు నడిపిస్తామని స్పష్టం చేశారు.
జాతీయ పతాకం ఆవిష్కరణ లబ్ధిదారులకు పథకాల పంపిణీ సాంస్కృతిక ప్రదర్శనల సందడి
భద్రాద్రి కొత్తగూడెం,జూన్,2,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిందని, వారి ఆశయాల సాధన కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువత, పేదల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.కార్యక్రమంలో భాగంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ 478 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద రూ.51.06 కోట్ల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి కుటుంబాభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించే లక్ష్యంతో వ్యవసాయ యాంత్రికరణ కార్యక్రమంలో భాగంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు రూ.59.53 లక్షల విలువైన ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. వ్యవసాయ వ్యయాలు తగ్గించి దిగుబడులు పెంచేందుకు ఆధునిక సాంకేతికత వినియోగం అవసరమని మంత్రి సూచించారు. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే నృత్యాలు, గేయాలు ప్రేక్షకులను అలరించాయి. విద్యార్థుల ప్రతిభను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, విద్యార్థులు, వివిధ శాఖల సిబ్బంది, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించాలని మంత్రి పిలుపునిచ్చారు.
హుస్నాబాద్కు కొత్త భవనం ములకనూరుకు ఆధునిక సదుపాయాలు రైతులకు మెరుగైన సేవలు మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్,జూన్,2,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. పశుపోషక రైతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో హుస్నాబాద్ ఏరియా పశువైద్యశాలకు, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ములకనూరు పశువైద్యశాలకు నూతన భవనాల నిర్మాణం కోసం మొత్తం రూ.1.40 కోట్ల నిధులను మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ నిధులను విడుదల చేశారు. ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి. నెం.36, తేదీ 02-06-2026 ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆధునిక సదుపాయాలతో కూడిన నూతన భవనాల నిర్మాణం పూర్తయితే పశువులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతంలో పశుసంపద అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ రైతుల జీవనాధారంగా మారిన నేపథ్యంలో వారికి అవసరమైన వైద్య సదుపాయాలను మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.నూతన భవనాల ద్వారా పశువైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందించడంతో పాటు అత్యవసర చికిత్సలు, వ్యాధి నిర్ధారణ, టీకాల కార్యక్రమాలు, పశు సంరక్షణ సేవలు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. ఆధునిక వసతులతో నిర్మించనున్న ఈ భవనాలు రైతులకు ఎంతో ఉపయోగపడనున్నాయని పేర్కొన్నారు. హుస్నాబాద్ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పశుపోషక రైతుల సంక్షేమం, పశుసంపద అభివృద్ధి కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్,జూన్,2,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, తప్పుడు హామీలు, విష ప్రచారాలతో అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశ నుంచి వెనక్కి నెట్టిందని అన్నారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. రైతులకు సరైన మద్దతు లేకపోవడం, పంటల కొనుగోళ్లలో జాప్యం, ఎరువుల సమస్యలు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయని ఆరోపించారు. రైతుబంధు వంటి పథకాల అమలులో కూడా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కేటీఆర్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ వెనుకబడుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పెట్టుబడిదారులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఉండేదని, ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని, వివిధ వర్గాల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అధికారం కోసం కాకుండా తెలంగాణ భవిష్యత్తు కోసం తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల ఆశయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మరో ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హైదరాబాద్,జూన్,2,(మెదక్ టుడే న్యూస్)డిజైనర్ టెక్ గురు ప్రతినిధి): ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వ్యవసాయ సంచాలకులు డాక్టర్ బి. గోపీ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయంలో ఎరువుల డీలర్ల సంఘం ప్రతినిధులు, హోల్సేల్ డీలర్లు, ఎరువుల తయారీ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు ఎలాంటి కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా నిల్వల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులు సాగు పనులు ప్రారంభించే సమయంలో ఎరువుల కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఎరువుల విక్రయాల సమయంలో పురుగుమందులు, సూక్ష్మపోషకాలు లేదా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను బలవంతంగా కొనుగోలు చేయించే లింకింగ్ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. రైతులు కోరిన ఎరువులను మాత్రమే విక్రయించాలని, అదనపు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయరాదని హెచ్చరించారు. ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గరిష్ట చిల్లర ధర కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయించినట్లు గుర్తిస్తే సంబంధిత డీలర్లు, విక్రేతలపై ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు–1985 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ సంచాలకులు హెచ్చరించారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, జిల్లా స్థాయిలో తనిఖీలు మరింత ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎరువుల సరఫరా, నిల్వలు, పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ, సహకార శాఖ, ఎరువుల సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో సహకార శాఖ ప్రత్యేక సంచాలకులు రాహుల్ రాజ్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఎరువుల తయారీ సంస్థల ప్రతినిధులు, డీలర్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు.