పాత్రికేయుల సేవలను కొనియాడిన మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.
(స్పెషల్ కరస్పాండెంట్)షాద్నగర్,మే,24,మెదక్ టుడే న్యూస్:లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధనలో మీడియా పోషించిన పాత్ర అమూల్యమని మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రశంసించారు. ప్రారంభం నుంచి చివరి వరకు పాత్రికేయులు అక్షరాయుధంతో ప్రజల తరఫున పోరాడి పాలకులను అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. జలాశయ సాధనే లక్ష్యంగా వార్తలు, కథనాలు ప్రచారం చేసి ప్రజా సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా కీలకంగా వ్యవహరించిందన్నారు.ఈ సందర్భంగా పాత్రికేయుల తరఫున సీనియర్ జర్నలిస్ట్ కేపీకి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి ఆంజనేయులు గౌడ్కు శాలువాలతో ఘన సన్మానం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మీడియా నిష్పక్షపాత ధోరణితో పనిచేసినప్పుడే ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు సులభమవుతాయని తెలిపారు. లక్ష్మీదేవిపల్లి అంశంలో మీడియా చూపిన పట్టుదల వల్లే పాలకులు స్పందించి అభివృద్ధి దిశగా అడుగులు వేసారని అన్నారు.
ప్రజల సమస్యలపై ఎవరైనా నిర్లక్ష్యం వహించినా ప్రశ్నించే హక్కు మీడియాకే ఉందని, భవిష్యత్తులో కూడా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా జర్నలిస్టులు ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా వెలువడిన కథనాలు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధనను వేగవంతం చేశాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పాత్రికేయులు రంగనాథ్, శరత్, రాఘవేందర్ గౌడ్, లక్కాకుల రమేష్, సరాపు రమేష్, నరసింహారెడ్డి, సాయి రెడ్డి, రాకేష్, మల్లికార్జున్, ధరంపాల్, షకీల్, రియాజ్, దర్శనం శంకర్ తదితరులు పాల్గొన్నారు.

