అమీన్ పూర్,మార్చి,25,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని బీరంగూడలో బుధవారం జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు భారీ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. జిహెచ్ఎంసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, బీరంగూడ ప్రధాన రహదారి నుండి కృష్ణారెడ్డి పేట వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ షాపులు, షెడ్లు మరియు కంటైనర్లను జెసిపి సహాయంతో తొలగించారు.
రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవు:
రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన ఫ్రూట్ షాపులు, కొబ్బరి బోండాల దుకాణాలు, ఇతర చిరు వ్యాపారాల వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ పైపులైన్ల మరమ్మతులకు మరియు వాహనదారులకు ఇబ్బందిగా ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు స్పష్టం చేశారు.
మళ్ళీ పెడితే ఉపేక్షించేది లేదు:
ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారులు మాట్లాడుతూ.. “ఈరోజు ఆక్రమణలు తీసేసిన తర్వాత, రేపు మళ్ళీ అదే స్థలంలో షాపులు పెడితే సహించేది లేదు. తొలగింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. యజమానులు నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల మీద వ్యాపారాలు చేయకూడదు” అని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలను, రోడ్లను కబ్జా చేసి షాపులు నిర్మిస్తే జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అధికారులపైనా చర్యలు:
బీరంగూడ – కృష్ణారెడ్డి పేట మార్గంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవడంలో ఎవరైనా అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలితే, వారిపై కూడా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ విభాగం స్పష్టం చేసింది. రోడ్లను క్లియర్ చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడమే తమ ప్రాధాన్యతని అధికారులు వెల్లడించారు.

