
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రతి మూడు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో రోజుకు సగటున సుమారు 450 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతుండగా, గత సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు 1.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయి, మరో 3 లక్షల మంది గాయపడ్డారని తెలిపారు.మెదక్ జిల్లాలో గత సంవత్సరం 287 మంది మృతి చెందగా, 631 మంది గాయపడ్డారని వివరించారు. ఈ గణాంకాల ప్రకారం జిల్లాలో ప్రతి రోజు ఎక్కడో ఒకచోట ఒకరు రోడ్డు ప్రమాదానికి బలవుతున్నారని చెప్పారు. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాకుండా, ప్రతి ప్రమాదం వెనుక ఒక కుటుంబం బాధ, కన్నీరు దాగి ఉందని అన్నారు.జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాలకు సంబంధించినవేనని వెల్లడించారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కఠినంగా హెచ్చరించారు.ద్విచక్ర వాహనదారులు రైడర్, పిలియన్ ఇద్దరూ ఐ ఎస్ఐ ప్రమాణిత హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయరాదని, ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేయకూడదని సూచించారు.ఈ సందర్భంగా వైద్యుడు సీపీఆర్ ( సి పి ఆర్ ) ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే అంశాలను ప్రదర్శనతో వివరించారు. అలాగే డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వైద్య అధికారి డాక్టర్ శ్రీరామ్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి వెంకట స్వామి, డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు మహేష్, సందీప్ రెడ్డి, జార్జ్, మున్సిపల్ చైర్మన్ కనుగుల రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

