చేగుంట,మే,12,మెదక్ టుడే న్యూస్:మెదక్ జిల్లా, చేగుంట మండలం, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ( డిసిఏ) నూతన డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన అవినాష్ మహంతి (ఐపీఎస్) ను మంగళవారం తెలంగాణ రాష్ట్రఫార్మసీ కౌన్సిల్ మెంబర్, తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రధాన కార్యదర్శి, మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీ తొడుపునూరి రాజు ఆధ్వర్యంలో మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. డీసీఏ ప్రధాన కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆన్లైన్ ఫార్మసీల వల్ల కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్ల వల్ల చిరు వ్యాపారులు, రిటైల్ మెడికల్ షాపుల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.అనంతరం, అఖిల భారత ఔషధ విక్రేతల సంఘం ( ఏఐఓ సిడి) పిలుపు మేరకు మే 20వ తేదీ బుధవారం నిర్వహించనున్న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్కు సంబంధించిన మెమోరండంను డీజీకి అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్లైన్ మందుల విక్రయాలను అరికట్టాలని, రిటైలర్ల ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డైరెక్టర్ జనరల్ అవినాష్ మహంతి.. రిటైలర్లు, హోల్సేలర్లకు క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఉంటే నేరుగా తనను కలిసి తెలియజేయవచ్చని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
