18 ఏళ్ల తర్వాత ఒక్కటైన మిత్రులు
చేగుంట,మే,24,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2007-08 విద్యాసంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన వేడుక వడియారంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. దాదాపు 18 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత సహచర మిత్రులంతా ఒకరినొకరు కలుసుకోవడంపై పూర్వ విద్యార్థులు అమితానందం వ్యక్తం చేశారు. నాటి పాఠశాల జ్ఞాపకాలను, చిన్ననాటి ముచ్చట్లను ఈ సందర్భంగా ఒకరితో ఒకరు పంచుకుంటూ సందడి చేశారు. ఈ ఆత్మీయ కలయిక తమ జీవితంలో ఒక మధురమైన రోజని వారు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాటి పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు బాలకృష్ణ, గర్దాస్ మనోహర్ రావు, చల్లా లక్ష్మణ్, రాజేశ్వరిలను విద్యార్థులు ఘనంగా సన్మానించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సమ్మేళనంలో నాటి పదవ తరగతి పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

