చేగుంట,మే,24,మెదక్ టుడే న్యూస్:నార్సింగి, చేగుంట మండలాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇరవై రోజులుగా రైతులు వేచిచూస్తున్నప్పటికీ.. సరిపడా లారీలు లేకపోవడం, కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎంఆర్ఓ, ఏఓలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు.వడదెబ్బల కారణంగా ఇద్దరు రైతులు అస్వస్థతకు గురైన ఘటనలను ప్రస్తావిస్తూ, రైతులు తీవ్ర మానసిక వేదనలో ఉన్నారని తెలిపారు. “మా ధాన్యాన్ని కొనకపోతే ఆత్మహత్యలు చేసుకుంటాం, ధాన్యానికి నిప్పంటిస్తాం” అనే స్థితికి రైతులను నెట్టివేసిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి, సంబంధిత మంత్రులు,అధికారులు ఎవరూ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.ఈ ప్రాంతంలో భారీగా వరి దిగుబడి వచ్చినప్పటికీ, ఉన్న ఎనిమిది రైస్ మిల్లుల్లో కూడా ధాన్యం సక్రమంగా దింపడం లేదని, దింపిన చోట్ల కిలోకు కిలోన్నర వరకు తరుగు పేరుతో కోతలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంపై జిల్లా సివిల్ సప్లై అధికారులు, కలెక్టర్ స్పందించి రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై ధర్నాలు చేసినా, వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని, బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. మరో రెండు మూడు రోజుల్లో మొత్తం ధాన్యాన్ని ఎత్తకపోతే అసెంబ్లీ ముట్టడికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఏ గ్రామంలో ఎంత ధాన్యం వస్తుంది, రైస్ మిల్లుల సామర్థ్యం ఎంత అనేది ముందస్తు ప్రణాళికతో పనిచేసేవాళ్లమని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల బాధలను పట్టించుకోకుండా కేవలం సమావేశాలు, ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ధాన్యం కొనకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాంఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
RELATED ARTICLES
