📄 ePaper
Saturday, June 6, 2026
ADS
Home Blog Page 30

అమీన్‌పూర్ పరిధిలో ఆగని బుల్డోజర్లు: అక్రమ కట్టడాల కూల్చివేత

0

ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు: తహసీల్దార్ వెంకటేష్ హెచ్చరిక

అమీన్‌పూర్,మార్చి,26,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ మండల పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై రెవెన్యూ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. అక్రమంగా వెలుస్తున్న కట్టడాలను రెవెన్యూ అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. గురువారం అమీన్‌పూర్ తహసీల్దార్ వెంకటేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టారు.

కూల్చివేతల వివరాలు:

  • ఐలాపూర్ గ్రామం: ఇక్కడ సర్వే నంబర్ 823 లోని ప్రభుత్వ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 3 బేస్‌మెంట్లు, నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిని అధికారులు పూర్తిగా కూల్చివేశారు.
  • అమీన్‌పూర్ సర్వే నంబర్ 993: ఈ సర్వే నంబర్ పరిధిలోని ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ కట్టడాలను కూడా రెవెన్యూ యంత్రాంగం తొలగించింది.

చట్టం అందరికీ ఒక్కటే – తహసీల్దార్ వెంకటేష్:

ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేష్ మాట్లాడుతూ ఆక్రమణదారులకు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు:

“ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టడాలు నిర్మిస్తే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పెద్దలు, పేదలు అనే తారతమ్యం మాకు లేదు; చట్టం ముందు అందరూ సమానులే. ప్రభుత్వ భూమిని కాపాడటమే మా మొదటి ప్రాధాన్యత. ఆక్రమణలకు పాల్పడే వారిపై కేవలం కూల్చివేతలతోనే ఆగకుండా, వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాము.”

ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరొక న్యాయం చేసే ప్రసక్తే లేదని, అక్రమ నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాల్లో భూమి కొనుగోలు చేసే ముందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో భారీగా నష్టపోతారని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, జిపిఓ లు, విలేజ్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

రోడ్లపై ఆక్రమణల తొలగింపు: అమీన్‌పూర్‌లో రెండో రోజు కొనసాగిన జిహెచ్ఎంసి కూల్చివేతలు.

0

అమీన్‌పూర్,మార్చి,26,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని ప్రధాన రహదారులపై ఉన్న అక్రమ కట్టడాలు, ఆక్రమణలపై జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండో రోజూ కూడా అధికారుల కూల్చివేత పర్వం వేగంగా కొనసాగింది. రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన షాపులు, పాన్ డబ్బాలు, తోపుడు బండ్లు మరియు రోడ్డుపైకి వచ్చిన భారీ ప్రకటన బోర్డులను జెసిబి సహాయంతో అధికారులు తొలగించారు.

నిబంధనలు అందరికీ సమానమే: అధికారులు

ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారులు షాపు యజమానులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.50 ఫీట్ల నిబంధన: రోడ్డు మధ్య భాగం నుండి కనీసం 50 ఫీట్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు లేదా వ్యాపార సామాగ్రి ఉండకూడదని, ఈ పరిధిలో ఉంటే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

  • పక్షపాతం లేదు: “ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం ఉండదు.. చట్టం ముందు అందరూ సమానమే. రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు” అని అధికారులు తేల్చి చెప్పారు.

మళ్లీ ఆక్రమిస్తే కఠిన చర్యలు

ఉదయం నుండే రంగంలోకి దిగిన అధికారులు, కూల్చివేసిన ప్రాంతాల్లో మళ్లీ షాపులు పెడితే భారీ జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్ల విస్తరణ, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పదే పదే నిబంధనలు అతిక్రమిస్తే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని యజమానులకు వార్నింగ్ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది మరియు భారీగా పోలీస్ బందోబస్తు పాల్గొన్నారు.

షాద్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. జగన్మోహన్ రెడ్డి విజయంఒక్క ఓటు తేడాతో గెలుపు – గత సేవలకే గుర్తింపు.

0

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్ నగర్,మార్చి,26,మెదక్ టుడే న్యూస్:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా బి. జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో ఆయన కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందడం విశేషం.
తన సమీప ప్రత్యర్థి, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్వ వేణుగోపాలరావు 66 ఓట్లు సాధించగా, జగన్మోహన్ రెడ్డి 67 ఓట్లు పొందారు. దీంతో ఒక్క ఓటుతో ఆయన గెలుపు సాధించారు.గురువారం నిర్వహించిన ఈ ఎన్నికలకు అధికారి గా మర్రి శంకరయ్య వ్యవహరించారు. అధ్యక్ష పదవికి మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీపడగా, దానక్క సంగమేశ్వర్ 23 ఓట్లు, సీనియర్ న్యాయవాది రజాక్ హుస్సేన్ కేవలం 5 ఓట్లు పొందారు.ఇక ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా రహీముద్దీన్ 108 ఓట్లు సాధించగా, గేమ్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా డి. శంకర్ 102 ఓట్లు పొందారు.గతంలో పలుమార్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి, కోర్టు ప్రాంగణ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన విషయం తెలిసిందే. ఆయన సేవలకు గుర్తింపుగానే ఈ విజయం లభించిందని న్యాయవాదుల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.తన అనుభవం, నాయకత్వంతో బార్ అసోసియేషన్‌ను మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తారని సహచర న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ఆంగ్ల దినపత్రికలో స్టాఫ్ రిపోర్టర్‌గా టి. సాయికుమార్ నియామకం.

0

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్ నగర్,మార్చి,26, మెదక్ టుడే న్యూస్:
క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ఆంగ్ల దినపత్రికలో ఫ్యూచర్ సిటీ విభాగానికి స్టాఫ్ రిపోర్టర్‌గా టి. సాయికుమార్‌ను నియమించారు. ఈ సందర్భంగా స్పెషల్ కరస్పాండెంట్ డా. కొమ్ము వెంకన్న బాబు సాయికుమార్‌కు నియామక పత్రం మరియు ఐడి కార్డు అందజేశారు.
ఈ సందర్భంగా డా. కొమ్ము వెంకన్న బాబు మాట్లాడుతూ, సాయికుమార్ జర్నలిజం రంగంలో నిబద్ధతతో పని చేసి పత్రికకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. వార్తల సేకరణలో నిజాయితీ, సమయపాలన ఎంతో ముఖ్యమని సూచించారు.స్టాఫ్ రిపోర్టర్‌గా నియమితులైన టి. సాయికుమార్ మాట్లాడుతూ,తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేసి, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పత్రిక ప్రతినిధులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.విభిన్న కథనాలతో, సెన్సేషనల్ ఆర్టికల్స్‌తో ప్రజల్లోకి వేగంగా చేరుకుంటూ, పాఠకుల ఆదరణ పొందుతున్న ఈ పత్రికను ఎడిటర్ శ్రీనివాసరావు నాయకత్వంలో తిరుగులేని ప్రముఖ దినపత్రికగా అభివర్ణించారు.

మారిన పాలన.. మారని రాత! దయారాలో నరకప్రాయంగా డ్రైనేజీ వ్యవస్థ.

0

• మురికి నీటిలోనే అమ్మవారి దర్శనం.. అంగన్‌వాడీకి వెళ్లాలన్నా తప్పని తిప్పలు.

• పంచాయతీ నుంచి జిహెచ్ఎంసి కి.. సమస్యలు మాత్రం తీరని వైనం.

• పట్టించుకోని అధికారులు.. దయారా గ్రామస్తుల తీవ్ర ఆగ్రహం.

అమీన్‌పూర్,మార్చి,26,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని, దయారా గ్రామంలో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. గ్రామం పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందినా, డ్రైనేజీ సమస్య మాత్రం దశాబ్దాల వెనుకబడే ఉంది. దయారాలోని పోచమ్మ దేవాలయం, వివేకానంద విగ్రహం, అంగన్‌వాడీ పాఠశాల సమీపంలో డ్రైనేజీ నీరు రోడ్లపై పొంగిపొర్లుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మురికి నీటిలోనే భక్తి.. చిన్నారుల అవస్థలు:

గ్రామస్తులు పవిత్రంగా భావించే పోచమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లాలన్నా భక్తులు మురికి నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు, అంగన్‌వాడీ పాఠశాలకు వెళ్లే చిన్నారులు కూడా ఈ మురుగు నీటిని దాటుకుంటూ వెళ్తుండటంతో తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీరు నిలవ ఉండటంతో దుర్వాసన వెదజల్లడమే కాకుండా, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై నిప్పులు:

“పంచాయతీ పోయి మున్సిపల్ వచ్చింది.. మున్సిపల్ నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వెళ్తున్నాం అంటున్నారు.. కానీ మా తిప్పలు మాత్రం తీరడం లేదు” అంటూ గ్రామస్తులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఎన్నో రోజులుగా డ్రైనేజీ సమస్యపై ఫిర్యాదులు చేస్తున్నా, సంబంధిత అధికారులు కనీసం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, దయారా గ్రామంలోని డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

చిట్కుల్ లో శాస్త్రోక్తంగా శ్రీ సీత రామ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం.

0

పటాన్ చెరు,మార్చి,25,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ సొంత నిధులతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ జిటిఎన్ కాలనీలో నిర్మించిన శ్రీ హనుమ సమేత సీతా రామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నులపండువగా ముగిసింది.
గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా, బుధవారం తెల్లవారుజాము నుండే వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9:43 గంటలకు మృగశిర నక్షత్ర యుక్త వృషభ లగ్న సుముహూర్తాన స్వామి వారి యంత్ర స్థాపన, బింబ స్థాపన, శిఖర స్థాపన ఘట్టాలను అత్యంత వైభవంగా పూర్తి చేశారు. అనంతరం మూర్తులకు ప్రాణ ప్రతిష్ఠ గావించి, నేత్రోన్మీలనము నిర్వహించారు.ఆలయ నిర్మాణంతో పాటు కాలనీలో భక్తి భావాన్ని పెంపొందించేందుకు నీలం మధు ముదిరాజ్ తీసుకున్న ఈ చొరవను కాలనీ వాసులు కొనియాడుతున్నారు.విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం మూర్తులకు ప్రత్యేక కళా కుంభాభిషేకము, శ్రీ సీతారామ స్వామి దేవతా అర్చనలు నిర్వహించారు. మహానివేదన, మంగళ నీరాజనాల అనంతరం భక్తులకు రక్షాధారణ, తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా రామనామ స్మరణతో చిట్కుల్ పుర వీధులు మార్మోగాయి.ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, భక్తులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

దోమడుగులో 79 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన-ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్.

0

గుమ్మడిదల,మార్చి,25,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.నూతనంగా ఏర్పడిన గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డును అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని దోమడుగు వార్డులో హెట్రో డ్రగ్స్ పరిశ్రమ సౌజన్యంతో 79 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, రక్షిత మంచినీటి పైపులైన్ల నిర్మాణ పనులకు బుధవారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుమ్మడిదల మున్సిపల్ అభివృద్ధి కోసం ఇప్పటికే 15 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి అని తెలిపారు. అతి త్వరలో ఇందుకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు.రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి పరిశ్రమల యాజమాన్యాలు సంపూర్ణ సహకారం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్యా గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దశరథ్, హెట్రో డ్రగ్స్ పరిశ్రమ ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, దోమడుగు కౌన్సిలర్ రాజశేఖర్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

బీరంగూడలో రోడ్డు ఆక్రమణల పాచికలు-జెసిపితో విరుచుకుపడ్డ జిహెచ్ఎంసి అధికారులు!

0

అమీన్ పూర్,మార్చి,25,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని బీరంగూడలో బుధవారం జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు భారీ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. జిహెచ్ఎంసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, బీరంగూడ ప్రధాన రహదారి నుండి కృష్ణారెడ్డి పేట వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ షాపులు, షెడ్లు మరియు కంటైనర్లను జెసిపి సహాయంతో తొలగించారు.

రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవు:

రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన ఫ్రూట్ షాపులు, కొబ్బరి బోండాల దుకాణాలు, ఇతర చిరు వ్యాపారాల వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ పైపులైన్ల మరమ్మతులకు మరియు వాహనదారులకు ఇబ్బందిగా ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు స్పష్టం చేశారు.

మళ్ళీ పెడితే ఉపేక్షించేది లేదు:

ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారులు మాట్లాడుతూ.. “ఈరోజు ఆక్రమణలు తీసేసిన తర్వాత, రేపు మళ్ళీ అదే స్థలంలో షాపులు పెడితే సహించేది లేదు. తొలగింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. యజమానులు నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల మీద వ్యాపారాలు చేయకూడదు” అని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలను, రోడ్లను కబ్జా చేసి షాపులు నిర్మిస్తే జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అధికారులపైనా చర్యలు:

బీరంగూడ – కృష్ణారెడ్డి పేట మార్గంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవడంలో ఎవరైనా అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలితే, వారిపై కూడా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ విభాగం స్పష్టం చేసింది. రోడ్లను క్లియర్ చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడమే తమ ప్రాధాన్యతని అధికారులు వెల్లడించారు.

అక్రమపీడీఎస్ బియ్యం పట్టివేత.

0

పాపన్నపేట,మార్చి,20,మెదక్ టుడే న్యూస్:అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ (చౌకబియ్యం) పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.శుక్రవారం పాపన్నపేట శివారులో మెదక్ వైపు నుంచి బొడ్మట్ పల్లి వైపు వెళ్తున్న ఓ వ్యాన్ ను తనిఖీ చేయగా అందులో ఉన్న సుమారు 224 క్వింటాళ్ల పీడీఎస్ (చౌకబియ్యం) పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని పంచనామా నిర్వహించారు.వారి ఫిర్యాదు మేరకు బియ్యం తరలిస్తున్న అశోక్, డ్రైవర్ వెంకట్ రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.ఎక్కడైనా పీడీఎస్ బియ్యం రవాణా చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

మెదక్ జిల్లాలో జూదంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఉక్కుపాదం

0

-నలుగురు అరెస్ట్ – ఇద్దరు పరారీలో

-రూ.4,750 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం

– ఎస్ పి శ్రీనివాసరావు ఐపీఎస్.

మెదక్,మార్చి,20,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)మెదక్ జిల్లా చిల్పిచేడ్ మండలం సిలంపల్లి గ్రామ శివారులోని డంప్‌యార్డు సమీపంలో అక్రమంగా జూదం ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి నలుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్ పి శ్రీనివాసరావు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని జూదం ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్ట్ అయిన వారిలో వెంకటాపురం లక్ష్మణ్, జుకంటి లోకయ్య, మన్నె ప్రసాద్, యల్లయ్యగారి భూమ్ రెడ్డి ఉన్నారు. ఈ ఘటనలో రాకేష్, పెద్దొల్ల సుధాకర్ రెడ్డి పరారీలో ఉండగా, సంఘటనా స్థలం నుండి రూ.4,750 నగదు మరియు 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు చిల్పిచేడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
జిల్లాలో ఎక్కడైనా జూద కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ పి హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.