అమీన్ పూర్,జూలై,23,
మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బీరంగూడ గుట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో గుప్త నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం అమ్మవారు ప్రత్యేకంగా శాకంబరీ దేవి అవతారంలో భక్తులకు అలంకార దర్శనమిచ్చారు.ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, విశేష అలంకరణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) దేవనాదం, ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ నవరాత్రి వేడుకలు కన్నులపండువగా సాగాయి. తొమ్మిది రోజులపాటు ఆలయానికివిచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.అమ్మవారి దర్శనానికి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, అర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు.
నేడు వరుణ యాగం:
దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు, వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈరోజు ఉదయం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా వరుణ యాగం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి దేవనాదం వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యాగంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.


