అమీన్పూర్, జూన్ 23:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి
రాత్రి కురిసిన భారీ వర్షానికి అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని దినేష్ హోమ్స్ మరియు నారాయణరెడ్డి కాలనీలు జలమయమయ్యాయి. రోడ్ల మీదకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల గోడలు కూలిపోగా, రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, మాజీ కౌన్సిలర్ నవనీత జగదీష్ గారు వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో పర్యటించారు. జేసీబీ సహాయంతో నీటిని బయటకు పంపేలా మరియు మురుగునీటి వ్యవస్థను పునరుద్ధరించేలా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
*స్థానికులకు భరోసా:*
ఈ సందర్భంగా నవనీత జగదీష్ మాట్లాడుతూ, “భారీ వర్షాల వల్ల కలిగిన నష్టం పట్ల కాలనీవాసులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు వేగవంతం చేశాం. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం” అని హామీ ఇచ్చారు.
*అధికారులకు హెచ్చరిక:*
అమీన్పూర్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పనిచేస్తున్న ఆమె, పెండింగ్లో ఉన్న డ్రైనేజీ పనుల మరియు రోడ్ల నిర్మాణాల పట్ల అసహనం వ్యక్తం చేశారు. “ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, పెండింగ్లో ఉన్న డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలి. లేనిపక్షంలో మళ్లీ ఇలాంటి ఇబ్బందులు పునరావృతమవుతాయి” అని ఆమె అధికారులకు స్పష్టం చేశారు.ప్రస్తుతం సహాయక బృందాలు రంగంలోకి దిగి నీటిని పంపింగ్ చేసే పనుల్లో నిమగ్నమయ్యాయి.

