లారీల కొరకు రైతులు ఆవేదన
కొల్చారం,మే,19,( మెదక్ టుడే న్యూస్)ధాన్యం కొనుగోలు కేంద్రంలో సుమారు 3500 బస్తాలు తూకం వేసి ఉంచామని, వారం రోజులు గడుస్తున్న లారీలు రావడంలేదని, తమకు వెంటనే లారీలు పంపించాలని పోతంశెట్టిపల్లి గ్రామ రైతులు తాసిల్దారును కోరారు. వరిగుంతం లోని ఎఫ్ఎంసీ గోదాము వద్ద తాసిల్దార్ శ్రీనివాస్ చారిని కలిసి రైతులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. తాసిల్దార్ మాట్లాడుతూ పోతంశెట్టిపల్లి గ్రామంలో తీవ్ర లారీలు కొరత ఉందని ముందుగా అక్కడికే లారీలు పంపిస్తానని చెప్పడంతో అప్పాజీపల్లి రైతులు అసంతృప్తికి లోనై తమకు లారీలు పంపించాలని తాసిల్దార్ తో వాదానికి దిగారు. అనంతరం పోలీసులు కలగజేసుకుని నచ్చజెప్పడంతో. రైతులు శాంతించారు. తమ గ్రామానికి కనీసం ఒక్క లారీ అయినా పంపిస్తే బాగుంటుందని వాపోయారు. ఈ కార్యక్రమంలో అప్పాజీపల్లి సీతారాం తండా వరిగుంతం గ్రామ రైతులు ఉన్నారు.

