భగీరథ్ను పోలీసులకు అప్పగించిన బండి సంజయ్
చట్టానికి అందరూ సమానమేనన్న కేంద్ర మంత్రి
విచారణకు పూర్తి సహకారం అందిస్తామన్న స్పష్టీకరణ
కేసులో ఆధారాలు సమర్పించినట్లు వెల్లడి
హైదరాబాద్,మే,16,(మెదక్ టుడే న్యూస్)కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తన కుమారుడిని న్యాయవాదుల ద్వారా పోలీసులకు అప్పగించినట్లు బండి సంజయ్ వెల్లడించారు. చట్ట ప్రకారం జరిగే విచారణకు పూర్తిగా సహకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ చట్టం ముందు తన కుమారుడు అయినా, సామాన్య వ్యక్తి అయినా అందరూ సమానమేనని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థపై తనకు ఉన్న గౌరవంతోనే భగీరథ్ను విచారణ కోసం అప్పగించామని చెప్పారు.
దేశంలో ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత సంబంధాల కంటే చట్టం గొప్పదనే భావనతోనే తాము వ్యవహరిస్తున్నామని తెలిపారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడని బండి సంజయ్ వెల్లడించారు. కేసుకు సంబంధించిన ఆధారాలను కూడా న్యాయవాదుల ద్వారా పోలీసులకు అందజేసినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఫిర్యాదు వచ్చిన తొలి రోజుల్లోనే భగీరథ్ను పోలీసులకు అప్పగించాలని భావించినట్లు తెలిపారు. అయితే కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలను సమర్పించాల్సిన అవసరం ఉండటంతో కొంత ఆలస్యం జరిగిందని వివరించారు.
ఇక ఆలస్యం చేయడం సమంజసం కాదని భావించి చట్టపరమైన ప్రక్రియలో భాగంగా కుమారుడిని పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. సమర్పించిన ఆధారాలను పోలీసులు పరిశీలించిన తర్వాత నిజానిజాలు బయటకు వస్తాయని, కేసు కొట్టివేయబడుతుందని న్యాయవాదులు చెప్పినట్లు బండి సంజయ్ తెలిపారు. బెయిల్ కూడా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మైనర్ బాలిక కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి భగీరథ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.
