•మహిళా సాధికారతే సమాజ ప్రగతికి పునాది
•అదనపు ఎస్పీ ఎస్ మహేందర్

మెదక్,మార్చ్,9,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందితో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, మహిళా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడంలోనే కాకుండా దేశ అభివృద్ధిలో కూడా మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. నేటి కాలంలో మహిళలు విద్య, వైద్యం, పరిపాలన, రక్షణ, క్రీడలు, సాంకేతిక రంగాలు సహా అన్ని విభాగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది ధైర్యం, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ప్రజల భద్రతకు విశేషంగా సేవలు అందిస్తున్నారని అదనపు ఎస్పీ అభినందించారు. శాంతి భద్రతలను కాపాడడంలో మహిళా పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విని పరిష్కరించడంలో మహిళా పోలీస్ సిబ్బంది ముందుంటున్నారని అన్నారు.
విధుల్లో ఉన్న సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ మహిళా పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఆయన తెలిపారు. కుటుంబ బాధ్యతలను నిర్వహించుకుంటూనే విధుల్లో రాణించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా విజయాలను సాధించగలరని చెప్పారు.
అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి మహిళా పోలీస్ సిబ్బందిని షాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డియస్పి ప్రసన్న కుమార్, ఆర్ఐ శైలందర్, సీఐ లు సందీప్ రెడ్డి, కృష్ణముర్తి, డీపీవో సిబ్బంది, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

