డప్పు చప్పుళ్లు, భజనలతో మారుమోగిన గ్రామం
చేగుంట,ఆగస్టు,10,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో సోమవారం పలారం బండి ఊరేగింపు కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవంలో గ్రామ యువకులు, మహిళలు, పెద్దలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పూలు, రంగురంగుల అలంకరణలతో తయారుచేసిన పలారం బండిని గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల నృత్యాలు, భజనలతో గ్రామమంతా ఉత్సవ శోభ సంతరించుకుంది. కాషాయ కండువాలు ధరించిన భక్తులు “అమ్మవారికి జై” అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపును విజయవంతం చేశారు.గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఊరిలోని ప్రతి ఇల్లు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో శివ పంచాయతన కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ గ్రామ కమిటీ సభ్యులు, యువకులను గ్రామ పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

