వర్షాకాలంలో పెరిగిన పారిశుధ్య సమస్యలు.. నిలిచిన వర్షపు నీరు, పిచ్చిమొక్కలతో దోమలకు ఆవాసాలు
పాపన్నపేట,ఆగస్టు,30, మెదక్ టుడే న్యూస్:వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి పాపన్నపేట గ్రామంలో దోమల బెడద తీవ్రంగా పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో పాటు పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోయి పారిశుధ్య సమస్యలు నెలకొన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందడంతో పలువురు గ్రామస్తులు జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ప్రమాదం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పారిశుధ్య చర్యలు ఎక్కడ?
మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, నిల్వ నీటిని తొలగించడం, పిచ్చిమొక్కలను తొలగించడం, దోమల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.అవసరమైన ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు, ఫాగింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.అధికారులు స్పందించి..గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టాలని ప్రజల కోరుకుంటున్నారు.విషజ్వరాల వ్యాప్తికి ముందే అప్రమత్తమై గ్రామంలో పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచాలని, నిల్వ నీటి ప్రాంతాలను గుర్తించి వెంటనే తొలగించాలని పాపన్నపేట గ్రామస్తులు కోరుతున్నారు.సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి దోమల నియంత్రణ, పారిశుధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

