రోడ్లపై కేజీ వీల్స్ రాజ్యం..! ప్రజల ప్రాణాలు గాల్లో.. అధికారులు నిద్రలో..!
పాపన్నపేట,జూలై,22, (మెదక్ టుడే న్యూస్)
పాపన్నపేట మండలంలోని గ్రామీణ రహదారులపై ట్రాక్టర్లకు అమర్చిన కేజీ వీల్స్ (ఇనుప చక్రాలు) యథేచ్ఛగా తిరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ పనుల కోసం పొలాల్లో మాత్రమే వినియోగించాల్సిన ఈ ఇనుప చక్రాలతో ట్రాక్టర్లు రహదారులపై నిర్భయంగా సంచరిస్తుండటంతో రోడ్లు వేగంగా దెబ్బతింటున్నాయి.
ఇప్పటికే వర్షాలతో గుంతలమయంగా మారిన రహదారులు, కేజీ వీల్స్ సంచారంతో మరింత అధ్వానంగా మారుతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు నిత్యం ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే పరిస్థితి నెలకొంది.
స్థానికుల కథనం ప్రకారం, మండలంలోని పలు గ్రామాల్లో ఈ కేజీ వీల్స్తో ట్రాక్టర్లు బహిరంగంగానే రోడ్లపై తిరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రహదారులను కాపాడాల్సిన యంత్రాంగం చూస్తూ ఊరుకుంటోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రజల ప్రాణ భద్రత కంటే నిర్లక్ష్యమే ముఖ్యమా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే రోడ్లపై కేజీ వీల్స్తో ట్రాక్టర్ల సంచారాన్ని నిషేధించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ, ఆర్&బీ శాఖ, పోలీసు అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

