ఎన్.ఆర్.ఐ ఆనంద్ నగర్ కాలనీలో ఘనంగా వినాయక నవరాత్రోత్సవాలు: నేడు లడ్డూ వేలం, స్వామివారి శోభాయాత్ర
అమీన్పూర్,సెప్టెంబర్,19,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని బీరంగూర డివిజన్ పరిధిలోని స్థానిక ఎన్.ఆర్.ఐ ఆనంద్ నగర్ కాలనీలో వినాయక చతుర్థి నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలు, అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమం అత్యంత ఘనంగా ముగిసింది. ఈ అన్నదాన విందులో కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 1000 నుంచి 1200 మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.గత 10 సంవత్సరాలుగా కాలనీలో ఐక్యమత్యంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయల వ్యయంతో అత్యంత వైభవంగా మండపాన్ని తీర్చిదిద్ది, లలితా సహస్రనామ, విష్ణు సహస్రనామ పారాయణాలు, మహిళలు మరియు పిల్లలకు సాంస్కృతిక పోటీలు, క్రీడా పోటీలు నిర్వహించారు. కాలనీవాసులు అందించిన ఆర్థిక, వస్తు రూప సహకారం, అలాగే 50 నుంచి 60 మంది సభ్యులతో కూడిన వాలంటీర్ టీమ్, కల్చరల్ కమిటీ సభ్యుల నిరంతర శ్రమతో కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.నేటి నిమజ్జన కార్యక్రమాల వివరాలుసాయంత్రం 4:00 గంటలకు: సంప్రదాయ ఉట్టి కొట్టే కార్యక్రమం.సాయంత్రం 5:00 గంటలకు: విశేష పూజలు అందుకున్న గణనాథుని మహా ప్రసాదం ‘లడ్డూ వేలం పాట’.అనంతరం: కాలనీ నడివీధుల గుండా అంగరంగ వైభవంగా స్వామివారి శోభాయాత్ర ప్రారంభమై, గంగా నిమజ్జనానికి తరలివెళ్లనుంది.ఇదే తరహా ఐక్యతతో కాలనీకి సంబంధించిన రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వ నిధులు సాధించుకోవాలని కాలనీ పెద్దలు పిలుపునిచ్చారు. ఈరోజు సాయంత్రం జరగబోయే ఉట్టి ఉత్సవం, లడ్డూ వేలం, శోభాయాత్రలో కాలనీవాసులు కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాలనీ కమిటీ, సొసైటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఆర్.ఐ ఆనంద్ నగర్ కాలనీవాసులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



