ఐదు నెలలుగా జీతాల్లేవు.. ఆపరేటర్ల పెన్డౌన్
పాపన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో మూడు రోజులుగా విధులకు దూరం
పాపన్నపేట,సెప్టెంబర్,18, మెదక్ టుడే న్యూస్:
పాపన్నపేట మండల ఎంపీడీవో కార్యాలయంలో ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో పెన్డౌన్ నిర్వహించారు.మూడు రోజులుగా విధులకు హాజరుకాకుండా శాంతియుతంగా నిరసన చేపట్టారు.ఆపరేటర్లు మాట్లాడుతూ.ఇతర మండలాల్లో పనిచేస్తున్న ఆపరేటర్లకు వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ, పాపన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తమకు మాత్రం ఐదు నెలలుగా జీతాలు అందడం లేదని తెలిపారు. నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.తమ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించి, పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.వేతనాలు అందే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని ఆపరేటర్లు తెలిపారు.

