వారం రోజుల్లో పనులు ప్రారంభించాలి..లేకుంటే భారీ ధర్నా.
ప్రతిపక్షాలను తిట్టడం మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టండి:పద్మా దేవేందర్రెడ్డి.
పాపన్నపేట,ఆగస్టు,10,మెదక్ టుడే న్యూస్:మెదక్–బొడ్మెట్పల్లి ప్రధాన మార్గంలోని కొత్తపల్లి వద్ద బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి బ్రిడ్జిని పరిశీలించి, వాహనదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ,బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.1.40 కోట్లతో బ్రిడ్జి నిర్మించినప్పటికీ అప్రోచ్ రోడ్డు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.బ్రిడ్జి వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.వారం రోజుల్లోగా అప్రోచ్ రోడ్డు పనులు ప్రారంభించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు.ప్రతిపక్షాలను విమర్శించడం మానుకుని ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


