శేరిలింగంపల్లి,ఆగస్టు,9,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని లింగంపల్లి నుండి అమీన్పూర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన వెలిసిన శ్రీ మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించగా, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శివశ్రీ పంతులు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి మైసమ్మ తల్లి భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతోందని తెలిపారు. భక్తుల కొరికలు తీర్చడంలో అమ్మవారి మహిమ అపారమని, ప్రతి ఆదివారం ఇక్కడ ప్రత్యేక పూజలతో పాటు వాహన పూజలు కూడా ఘనంగా జరుగుతాయని పేర్కొన్నారు.ఈ ఏడాది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో జనం తరలివచ్చారని, సుమారు రెండు నుంచి మూడు వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, పాడిపంటలు సమృద్ధిగా కురిసేలా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ప్రధాన అర్చకులు ఆకాంక్షించారు.


