హరీష్ రావు ని విమర్శించే స్థాయి నీకు లేదు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం
జిల్లా మంత్రి ఒత్తిడితోనే అక్రమ కేసులు.. సొంత కుటుంబానికే న్యాయం చేయని నువ్వా మాకు చెప్పేది?
పటాన్చెరు,మార్చి,31,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పై మరియు తనపై కాంగ్రెస్ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న నిరాధార ఆరోపణలపై పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాటా శ్రీనివాస్ గౌడ్ తీరును ఎండగట్టారు.
వార్తలోని ముఖ్యాంశాలు:
- నీ స్థాయి తెలుసుకో: “రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన నీకు.. మూడుసార్లు ప్రజల మద్దతుతో గెలిచిన నాపై, ఉద్యమ నేత హరీష్ రావు పై మాట్లాడే అర్హత లేదు. ఐదు మున్సిపాలిటీల్లో ప్రజలు చెంప చెళ్లుమనిపించినా నీకు సిగ్గు రాలేదా?” అని ఎమ్మెల్యే నిలదీశారు.
- వసూళ్ల పర్వం – టికెట్ల అమ్మకం: ఎన్నికల సమయంలో కార్యకర్తలకు బి-ఫామ్ లు అమ్ముకోవడం కాటా నీచ చరిత్ర అని, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని రూ. 40 లక్షలకు అమ్ముకున్నాడని ఆరోపించారు. జిల్లా మంత్రి కూతురు పెళ్లి పేరుతో బిల్డర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడింది నిజం కాదా అని ప్రశ్నించారు.
- మైనింగ్ కేసు వెనుక రాజకీయ కుట్ర: జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ ఒత్తిడితోనే తన సోదరుడిపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టించారని ఆరోపించారు. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే తాము క్రషర్ నడిపామని, గతంలో వేరే కంపెనీ చేసిన మైనింగ్ను కూడా తమ ఖాతాలో వేసి తప్పుడు పెనాల్టీలు వేశారని వివరించారు. కోర్టు రీ-సర్వేకు ఆదేశించినా, మంత్రి ఒత్తిడితో అధికారులు సర్వే చేయకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.
- కబ్జా ఆరోపణలు నిరూపించు: పోచారం, అన్నారం భూములపై కాటా చేస్తున్న ఆరోపణలు కేవలం అజ్ఞానమేనని కొట్టిపారేశారు. “నేను ఒక గజం భూమి కబ్జా చేసినట్టు నిరూపించినా ఏ శిక్షకైనా సిద్ధం. 2001 నుండి నా సొంత ఆస్తులు అమ్ముకుని ప్రజా సేవ చేస్తున్నానే తప్ప.. నీలా కబ్జాలు చేయలేదు” అని స్పష్టం చేశారు.
- కుటుంబ ద్రోహివి నువ్వు: “సొంత తల్లికి తిండి పెట్టక, తోబుట్టువులను మోసం చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే నువ్వు ప్రజలకు ఏం సేవ చేస్తావు? సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తివి పటాన్చెరు ప్రజల గురించి మాట్లాడటం హాస్యాస్పదం” అని ఎద్దేవా చేశారు.
హెచ్చరిక:
ఇప్పటికైనా బట్టేబాజ్ మాటలు బంద్ చేసి, ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, లేనిపక్షంలో ప్రజలే నీకు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు.ఈ సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాటా సునీత రాజేష్ గౌడ్, పటాన్చెరు బిఆర్ఎస్ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్స్, మాజీ కౌన్సిలర్స్, మాజీ కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, నవీన్, శంకర్ యాదవ్ మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

