జాతీయ రహదారి 44 పైన రోడ్డు ప్రమాదం మహిళ మృతి
చేగుంట నవంబర్ 15 మెదక్ టుడే న్యూస్
జాతీయ రహదారి 44 హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన భార్య మృతిచెందగా, భర్త, కుమారుడు ఇద్దరికి గాయాలైన సంఘటన ఇస్లాంపూర్ గ్రామంలో విషాదాయ ఛాయలు అలుముకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.తన కుమారుని స్కూల్ ఫీజు కట్టి ఇంటికి వస్తుండగా దంపతులు ప్రయాణిస్తున్న బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందిన దుర్ఘటన శనివారం చోటుచేసుకుంది.తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన పాటి చందూ, తన భార్య పాటి లక్ష్మీ, కుమారుడు తనయ్ (6) తో కలిసి మాసాయిపేట మండలం రామంతాపూర్ లోని జాన్సన్ అకాడమీ స్కూల్కు వెళ్లి ఫీజు కట్టి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఇదే సమయంలో వెనుకనుంచి వచ్చిన కంటైనర్ లారీ బైక్ను ఢీకొనడంతో పాటి లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందింది. పాటి చందూకు తలకు తీవ్రమైన గాయాలు, చిన్నారి తనయ్కు కూడా గాయాల య్యాయి వెంటనే 108 అంబులెన్స్ పైలెట్ భాను సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఇస్లాంపూర్ మాజీ సర్పంచ్ జంగం రమేష్ మాట్లాడుతూ ఈ ప్రమాదం గ్రామంలో తీవ్ర విషాదాన్ని కలిగించిందని, గాయపడిన వారి చికిత్స కోసం అవసరమైన సహాయం అందిస్తున్నామని తెలిపారు.
