అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అమీన్పూర్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ కుటుంబ సభ్యుల.
అమీన్పూర్, జూన్ 27:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.బీరంగూడ డివిజన్ పరిధిలోని మారుతి నగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శనివారం విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నందారం నరసింహ గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు భక్తుల కోసం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 1,300 నుంచి 1,500 మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆలయ, కాలనీల అభివృద్ధికి నా వంతు కృషి:
ఈ సందర్భంగా నందారం నరసింహ గౌడ్ మాట్లాడుతూ, “మారుతి నగర్లో కొలువుదీరిన లక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. భక్తుల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడంలో మా కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది” అని పేర్కొన్నారు. అలాగే, బీరంగూడ డివిజన్ పరిధిలోని కాలనీల అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని, స్థానిక సమస్యల పరిష్కారానికి, కాలనీల మౌలిక వసతుల కల్పనకు మన స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం కూడా మెండుగా ఉందని, వారి నాయకత్వంలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని ఆయన హామీ ఇచ్చారు.
అభినందించిన ఆలయ కమిటీ:
అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. “నరసింహ గౌడ్ గారి కుటుంబం చేపట్టిన ఈ సేవా కార్యక్రమం అభినందనీయం. వారి కుటుంబంపై ఆ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము” అని కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు, మారుతి నగర్ కాలనీ వాసులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


