•చేగుంట–వడియారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి..
•ఈమార్గాన్ని ‘జీరో యాక్సిడెంట్ జోన్’గా ప్రకటించే దిశగా చర్యలు – మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు..
చేగుంట,నవంబర్,22,మెదక్ టుడే న్యూస్:
మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రైల్వే, ఫారెస్ట్, ఆర్&బీ, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మాట్లాడుతూ,చేగుంట–వడియారం రైల్వే గేటు వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ( ఆర్ ఓ బి) పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైల్వే గేటు మూసివేయబడిన ప్రతి సమయంలో వందలాది వాహనాలు రెండు వైపులా నిలిచిపోవడం వల్ల అంబులెన్స్లు, అత్యవసర సేవల వాహనాలు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయన్నారు.రద్దీ సమయాల్లో పాదచారులు రైల్వే ట్రెక్కులను దాటే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడి, పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. రోడ్లు–రైలు సంగమ ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మరియు అండర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని ఎంపీ గుర్తుచేశారు.ఎంపీ రఘునందన్ రావు గారు సంబంధిత శాఖల ఇంజనీర్లు, కాంట్రాక్టర్ సమన్వయంతో ఆర్ ఓ బి, పనులను వేగవంతం చేసి తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే సర్వీస్ రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్, సిగ్నలింగ్ వంటి అనుబంధ సదుపాయాలను సమగ్రంగా ఏర్పాటు చేసి ప్రజలకు సురక్షితమైన రవాణా వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.రాబోయే రోజుల్లో చేగుంట–వడియారం రైల్వే మార్గాన్ని “జీరో యాక్సిడెంట్ జోన్” గా తీర్చిదిద్దే లక్ష్యంతో చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.సమన్వయ సమావేశంలో రైల్వే, ఆర్&బీ, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులంతా పాల్గొన్నారు.

