మెదక్,జూలై,21,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)
మంగళవారం రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు మరియు కలెక్టర్లు, ఈ.ఆర్.ఓ.లు, ఎ.ఈ.ఆర్.ఓ.లతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ,ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అన్ని జిల్లాలలో వేగవంతంగా పూర్తి చేసి, భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన కాలంలోగా పూర్తి చేయాలని తెలిపారు.అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, అనర్హుల పేర్ల తొలగింపు, ఓటరు వివరాల సవరణ వంటి ప్రక్రియలను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు.బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి సమగ్ర సమాచారాన్ని సేకరించాలని, ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ దరఖాస్తులను స్వీకరించి త్వరితగతిన ఆన్లైన్ పూర్తి చేయాలని తెలిపారు.అందిన ఫారాలు, దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించి, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లాల వారీగా పురోగతిని ప్రతిరోజూ సమీక్షిస్తూ, పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ,భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్యువరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను 83 % శాతం పూర్తి చేశామని, నిర్ణీత వ్యవధిలోనే అధికారుల సమన్వయంతో వేగవంతం చేస్తామని తెలిపారు. గడువులోగా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిచేసే విధంగా చర్యలుతీసుకుంటున్నామని తెలిపారు.బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్ల సమన్వయంతో ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.ఈ సమావేశంలో మెదక్ ఆర్డీవో రమాదేవి,నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ , ఎన్నికల సూపర్డెంట్ తదితరులు పాల్గొన్నారు.
