MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 9:33 am Digital Edition : Shiva Kumar

విద్యార్థులపై లాఠీచార్జ్‌ దారుణం-ప్రశ్నించే గొంతుకలను అణచొద్దు.

నీట్‌ లీకేజీపై పార్లమెంట్‌లో చర్చ జరపాలి.

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి.

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి.

మెదక్,జూలై, 22,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)

ఢిల్లీలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం కల్పించిందని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను వినాలే తప్ప, బలప్రయోగంతో నిరసనలను అణచివేయకూడదని సూచించారు.నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, పార్లమెంట్‌లో విద్యార్థుల సమస్యలు, నీట్‌ పేపర్‌ లీకేజీపై సమగ్ర చర్చ నిర్వహించాలని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన సందర్భంగా జరిగిన ఘటనలపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని, నీట్‌ పేపర్‌ లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా పారదర్శక పరీక్షా విధానాన్ని అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని పద్మా దేవేందర్‌రెడ్డి కోరారు.