- మెదక్ జూలై 11 మెదక్ టుడే న్యూస్
మెదక్ జిల్లా పోలీసు శాఖ చేపట్టిన ‘పోలీస్ అక్క’ కార్యక్రమంలో భాగంగా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా పోలీసు కానిస్టేబుల్ తస్లీమా స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యక్తిగత భద్రత, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సైబర్ నేరాల నుంచి రక్షణ, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించడం, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. అలాగే పాఠశాల, ఇల్లు లేదా ఇతర ప్రదేశాల్లో ఎలాంటి వేధింపులు, బెదిరింపులు లేదా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.పోలీసులు విద్యార్థుల భద్రతకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, సహాయం అవసరమైన ప్రతి సందర్భంలో నిర్భయంగా ‘పోలీస్ అక్క’ లేదా సమీప పోలీసు సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.