పాపన్నపేట,ఏప్రిల్,28,మెదక్ టుడే న్యూస్:మద్యం మత్తులో క్షణికావేశంలో ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని నాగ్సాన్ పల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు.గ్రామానికి చెందిన కాగితాల జహంగీర్(39) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.గత కొన్ని రోజులుగా ప్రతి రోజు మద్యం సేవించి ఇంటికి వస్తున్నాడు.తాగుడుకు బానిస మారడంతో చిన్నపాటి అప్పులు పెరిగి అవి ఎలా తీర్చాలో తెలియక మనస్తాపం చెందుతున్నాడు.ఈ క్రమంలో సోమవారం రాత్రి సమయంలో మద్యం సేవించి ఓ దావత్ లో భోజనం చేసి ఇంటికి వచ్చాడు.రాత్రి ఇంటి బయటే నిద్రించాడు.మంగళవారం ఉదయం పొలం వద్ద ఉన్న ఓ చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని అటుగా వెళ్లిన స్థానికులకు కనిపించాడు.స్థానికులు కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి తల్లి షాబేరా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
