చేగుంట,మే,25,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం ఉదయవరం (వడియారం) గ్రామ రోడ్డు పక్కన నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి, భువనేశ్వరి మాత, శ్రీ పెద్దిరాజు ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల ఆహ్వాన పత్రికను ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు కలిసి చేగుంట ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీకి ఘనంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూన్ 26వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వేద పండితులు శ్రీ కృష్ణం రఘురామ శర్మ, శ్రీ రేవునూరి వెంకటేశ్వర శర్మల ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయని తెలిపారు. జూన్ 26న విగ్రహాల ఊరేగింపు, 27న యాగశాల ప్రవేశం, 28న చండీహోమం, ముఖ్యంగా జూన్ 29న ఉదయం 08:26 గంటలకు ప్రాణప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని, జూన్ 30న బండ్ల ప్రదక్షిణతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఈ మహాత్కార్యానికి ఉపసర్పంచ్ రఫీతో పాటు భక్తులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. పత్రికను స్వీకరించిన ఉపసర్పంచ్ రఫీ.. కార్యక్రమానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం బాధ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.