MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 8:54 am Digital Edition : Shiva Kumar

ఉపాధి హామీ కార్యాలయంలో ఉద్యోగుల ఇష్టారాజ్యం..?సెల్‌ఫోన్లలో మునిగితేలుతున్న సిబ్బంది..

ప్రజల ప్రశ్నలకు సమాధానమే లేదు..!
పాపన్నపేట ఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యాలయ పనితీరుపై తీవ్ర విమర్శలు..

పాపన్నపేట,జూలై 24 (మెదక్ టుడే న్యూస్):పాపన్నపేట మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) కార్యాలయంలో ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందనే ఆరోపణలువెల్లువెత్తుతున్నాయి.కార్యాలయానికి వచ్చే ప్రజలను పట్టించుకోకుండా కొందరు ఉద్యోగులు సెల్‌ఫోన్లలో వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉపాధి హామీ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శుక్రవారం మధ్యాహ్నం 1:20 గంటలకు కార్యాలయాన్ని సందర్శించిన విలేకరులకు కూడా ఇదే పరిస్థితి కనిపించింది.తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన కూలీలకు సరైన సమాచారం ఇవ్వకుండా, ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ప్రత్యక్షంగా గమనించారు.ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయంలోసిబ్బంది,బాధ్యతారాహిత్యంగావ్యవహరిస్తుండటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తీరుతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఈ విషయమై స్పందన కోసం పాపన్నపేట మండల ఏపీఓ బి. మైపాల్ రెడ్డిని ఫోన్ ద్వారా సంప్రదించేందుకు విలేకరులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఆయన స్పందించలేదు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఉపాధి హామీ కార్యాలయ పనితీరుపై విచారణ జరిపి, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఉద్యోగులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.