మెదక్,డిసెంబర్,9,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్కు 44 గంటల ముందు నుండి సైలెంట్ పీరియడ్ అమలు.
ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు పటిష్ఠ బందోబస్తు.
ఎన్నికలు పూర్తయ్యే వరకు 163బి,ఎన్,ఎస్,ఎస్ (144 సెక్షన్) అమల్లో
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు,జిల్లా ఎస్పీ. శ్రీ. డి. వి. శ్రీనివాస రావు.స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి విడతగా రేగోడ్, హవెలిఘణపూర్,టేక్మాల్, అల్లాదుర్గ్,పాపన్నపేట,పెద్ద శంకరంపేట్ మండలాల్లో 11-12-2025 న జరగనున్న నేపథ్యంలో,ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరగేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాల నిఘా లో ఉంటాయని తెలిపారు.
పోలింగ్కు44 గంటల ముందు నుండి 09-12-2025 సాయంత్రం 5 గంటల నుండి పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్ అమల్లో ఉంటుందని తెలిపారు.ఈసమయంలో సభలు, సమావేశాలు, ఇంటింటా ప్రచారం పూర్తిగా నిషేధమని తెలిపారు.
ఎంసీసీ (Model Code of Conduct) ఉల్లంఘనలు జరిగితే ఎన్నిక రద్దు అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.ఎన్నికల సమయంలో మద్యం, డబ్బుల పంపిణీ చేసినా,గొడవలు లేదా అల్లర్లు సృష్టించినా వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మొదటి విడత ఎన్నికల నిర్వహణ కోసం మూడు అంచెల భద్రతా వ్యవస్థతో మొత్తం 750 మంది పోలీసు సిబ్బందిని నియమించి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ పి పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ బందోబస్తు కొనసాగుతుందని అన్నారు.ఎన్నికలు ముగిసే వరకు 163 బి.ఎన్.ఎస్.ఎస్ (144 సెక్షన్) అమల్లో ఉంటుందని, ముగ్గురికి మించి గుంపులుగా ఉండడం నిషేదమని తెలిపారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, అసత్య సమాచారం,వదంతులు వ్యాప్తి చేసే వారి పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే విధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరిగితే సంబంధిత వ్యక్తులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.పోలింగ్కు 44 గంటల ముందు నుండి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సమావేశాలు, ర్యాలీలు లేదా ఏ విధమైన ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు.ఇతర ప్రాంతాల నుండి ప్రచారానికొచ్చిన వారు స్థానికంగా ఉండకూడదని, 09-12-2025 సాయంత్రం 5 గంటలులోపు ఖాళీ చేయాలని ఆదేశించారు.