రామచంద్రపురం,మే,9,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్ డివిజన్లో శ్రీ శ్రీ శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆలయానికి చేరుకున్న ఆదర్శ్ రెడ్డికి నిర్వహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.అనంతరం ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతిని, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. మన సాంప్రదాయ విలువలను కాపాడుకోవడంలో ఇటువంటి ఉత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. భక్తి భావం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు జగనాథ్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, విశ్వకర్మ సంఘం సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని కళ్లారా తిలకించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంఘ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
