MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 2:47 pm Digital Edition : SHIVA KUMAR

శ్రీ గాయత్రీ ఆసుపత్రిలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ.

వైద్య సేవలు, రికార్డులు, భద్రతా ఏర్పాట్లపై సమగ్ర పరిశీలన

శంకరంపేట,(ఎ),ఆగస్టు,21, మెదక్ టుడే న్యూస్: 

శంకరంపేట (ఎ)లోని శ్రీ గాయత్రీ ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ గణేశ్వర్ శుక్రవారం వైద్య సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగుల రికార్డులు, సిబ్బంది విద్యార్హత ధ్రువపత్రాలు, వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఆసుపత్రిలో పీసీపీఎన్‌డీటీ చట్టంపై అవగాహన పోస్టర్లు ఏర్పాటు చేయాలని, ఎక్స్‌రే గది వద్ద ఆరోగ్య భద్రతా సూచనలు స్పష్టంగా ప్రదర్శించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు.రోగుల వివరాలు, వైద్య రికార్డులు, పరీక్షా నివేదికలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.వైద్యులు, సిబ్బంది విద్యార్హత ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచాలని, ఆపరేషన్ థియేటర్‌ను పరిశుభ్రంగా,ఇన్‌ఫెక్షన్ రహితంగా నిర్వహించాలని సూచించారు.రోగులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి డీఎంహెచ్‌ఓ డాక్టర్ గణేశ్వర్ సూచించారు.గాయత్రీ ఆసుపత్రిలో రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గణేశ్వర్, ఇతర అధికారులు.