MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 3:35 am Digital Edition : SHIVA KUMAR

రోడ్లపై ఆక్రమణల తొలగింపు: అమీన్‌పూర్‌లో రెండో రోజు కొనసాగిన జిహెచ్ఎంసి కూల్చివేతలు.

అమీన్‌పూర్,మార్చి,26,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని ప్రధాన రహదారులపై ఉన్న అక్రమ కట్టడాలు, ఆక్రమణలపై జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండో రోజూ కూడా అధికారుల కూల్చివేత పర్వం వేగంగా కొనసాగింది. రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన షాపులు, పాన్ డబ్బాలు, తోపుడు బండ్లు మరియు రోడ్డుపైకి వచ్చిన భారీ ప్రకటన బోర్డులను జెసిబి సహాయంతో అధికారులు తొలగించారు.

నిబంధనలు అందరికీ సమానమే: అధికారులు

ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారులు షాపు యజమానులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.50 ఫీట్ల నిబంధన: రోడ్డు మధ్య భాగం నుండి కనీసం 50 ఫీట్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు లేదా వ్యాపార సామాగ్రి ఉండకూడదని, ఈ పరిధిలో ఉంటే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

  • పక్షపాతం లేదు: “ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం ఉండదు.. చట్టం ముందు అందరూ సమానమే. రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు” అని అధికారులు తేల్చి చెప్పారు.

మళ్లీ ఆక్రమిస్తే కఠిన చర్యలు

ఉదయం నుండే రంగంలోకి దిగిన అధికారులు, కూల్చివేసిన ప్రాంతాల్లో మళ్లీ షాపులు పెడితే భారీ జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్ల విస్తరణ, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పదే పదే నిబంధనలు అతిక్రమిస్తే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని యజమానులకు వార్నింగ్ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది మరియు భారీగా పోలీస్ బందోబస్తు పాల్గొన్నారు.