MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 4:17 pm Digital Edition : Shiva Kumar

ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ చర్యలు మెదక్ జిల్లా ఎస్పీ.

పారదర్శకంగా విచారణ చేపట్టాలి: మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు

మెదక్,జూలై,20,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)

ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి ఒక్కో అర్జీని పరిశీలించారు.
జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వ్యక్తిగత, సామాజిక, భూ వివాదాలు, మోసాలు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను తెలియజేశారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండరాదని, ప్రతి వినతిదారునికి వారి ఫిర్యాదు పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ద్వారా పోలీసు వ్యవస్థపై విశ్వాసం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యల పరిష్కారం కోసం పోలీసులను సంప్రదించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.