నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని అభినంధించిన మెదక్ జిల్లా ఎస్పీ. డి. వి శ్రీనివాస రావు ఐపీఎస్
మెదక్,జూలై,20,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)
మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి జిల్లా పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు.మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోళ్లపల్లి గ్రామానికి చెందిన బేగరి బేత్తయ్య (25) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అతని ఆటోలో మోడల్ స్కూల్కు వెళ్లే 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. 2021 జనవరి 15న పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లింగంపల్లికి తీసుకెళ్లి అద్దె గదిలో ఉంచాడు. మరుసటి రోజు ఉద్యోగం చూసుకుని వస్తానని చెప్పి వెళ్లిన నిందితుడు తిరిగి రాలేదు. మూడు రోజుల తర్వాత తన తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారని తెలుసుకున్న బాలిక ఇంటికిచేరుకునిజరిగినవిషయాన్నివెల్లడించింది.బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి పెద్ద శంకరంపేట్ ఎస్ఐ నరేందర్ పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి ఐఓ అల్లాదుర్గం సీఐ రవి దర్యాప్తు చేపట్టి సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య బలమైన వాదనలు వినిపించగా, భరోసా లీగల్ అడ్వైజర్ శ్వేత బాధిత బాలికకు సాక్ష్యం చెప్పడంలో సహకారం అందించారు. సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం. సుభావళి నిందితుడిపై అభియోగాలు రుజువైనట్లు నిర్ధారించి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ కేసులో లైజనింగ్ అధికారులు ఎస్ఐ విఠల్, కానిస్టేబుల్ కృష్ణ, సీడీవో విటోబా సమన్వయం చేయగా, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ బృందం, భరోసా సిబ్బంది మరియు సంబంధిత పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.