అమీన్పూర్,ఆగస్టు,27,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని పీజేఆర్ కాలనీలో శ్రీ బ్రహ్మ సూత్ర మరకత శివలింగం, నవగ్రహాలు మరియు నాగదేవత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మాజీ కౌన్సిలర్ కొత్తపల్లి మహాదేవ్ రెడ్డి ఆధ్వర్యంలో, కాలనీవాసుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ వార్డు మెంబర్ నల రవీందర్ రెడ్డి, ప్రముఖ నాయకులు మన్నే రవీందర్, ఎర్రోళ్ల పాండు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులను మాజీ కౌన్సిలర్ కొత్తపల్లి మహాదేవ్ రెడ్డి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం నాయకులు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ.కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా ఇంతటి సుందరమైన ఆలయాన్ని నిర్మించి, ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన మహాదేవ్ రెడ్డిని, కాలనీవాసులను ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.