MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 5:39 am Digital Edition : Shiva Kumar

పేదల ప్రాణాలతో చెలగాటమా..?

మెదక్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల గోడు.. ఓపీ నుంచి డాక్టర్ వరకు పరుగులే..!

రోగి మాట వినకుండానే మరో గదికి పంపుతున్నారంటూ ఆవేదన.. అధికారులు స్పందించాలని ప్రజల విజ్ఞప్తి

మెదక్,ఆగస్టు,6,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)

“ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఆరోగ్యం బాగుపడుతుందనుకున్నాం… కానీ మా బాధ చెప్పుకునే అవకాశం కూడా దొరకడం లేదు” అంటూ మెదక్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఓపీ కౌంటర్ నుంచి సంబంధిత వైద్యుడిని కలిసే వరకు ఒక డాక్టర్ వద్ద నుంచి మరో డాక్టర్ వద్దకు, ఒక గది నుంచి మరో గదికి పంపిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.తమ ఆరోగ్య సమస్యను పూర్తిగా వివరించకముందే “అక్కడికి వెళ్లండి..ఈ డాక్టర్‌ను కలవండి…అంటూ పంపిస్తున్నారని వాపోతున్నారు.దీంతో వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు, ఇతర రోగులు గంటల తరబడి ఆసుపత్రి ప్రాంగణంలో తిరగాల్సి వస్తోందని చెబుతున్నారు.ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకంతో వచ్చిన పేద, మధ్యతరగతి ప్రజలు చివరకు విసిగి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ, రోగుల పట్ల మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించడం కూడా అంతే ముఖ్యమని ప్రజలు గుర్తుచేస్తున్నారు.రోగి ఆసుపత్రికి చికిత్స కోసం వస్తాడు…తిరుగుల కోసం కాదు.రోగి చెప్పే సమస్యను పూర్తిగా విని, సరైన వైద్యుడి వద్దకు మార్గనిర్దేశం చేయడం ప్రతి వైద్య సిబ్బంది బాధ్యత.మెదక్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించి,వాస్తవ పరిస్థితులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.అలాగే ఆసుపత్రిలో ప్రతి రోగికి గౌరవప్రదమైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.