-తల్లిని మోసం చేసి రూ.లక్షన్నరలకు నవజాత శిశువు విక్రయం
-మెదక్ జిల్లాలో అమానుష ఘటన కలకలం
-ఐదు రోజుల తర్వాత బతికే ఉందన్న విషయం తెలుసుకున్న తల్లి
మెదక్,మే-6,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి):మెదక్ జిల్లాలో మానవత్వానికే మచ్చ తెచ్చే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టిన పసికందు చనిపోయిందని ఓ తల్లిని నమ్మించిన నర్సు, ఆ నవజాత శిశువును రహస్యంగా రూ.1.50 లక్షలకు విక్రయించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ అమానుష ఘటన బయటపడటంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ తండాకు చెందిన నస్రా ఫాతిమా ప్రస్తుతం సికింద్రాబాద్ మౌలాలిలో నివసిస్తోంది. ఏడు నెలల గర్భిణిగా ఉన్న ఆమె ఇటీవల అత్తగారింటికి వెళ్లేందుకు మెదక్కు వచ్చింది. ఈ సమయంలో బస్టాండ్ వద్ద చేతిలో ఉన్న చిప్స్ ప్యాకెట్పై కోతులు దాడి చేయడంతో తీవ్ర భయానికి గురైంది. అక్కడున్న స్నేహితురాలు వెంటనే ఫాతిమాను సమీప ఆసుపత్రికి తరలించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించగా ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న అక్తరీ బేగం అత్యంత దారుణంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.పుట్టిన పాప చనిపోయిందని ఫాతిమాను నమ్మించిన నర్సు, ఆమె దుఃఖంలో ఉండగానే శిశువును రహస్యంగా విక్రయించినట్లు సమాచారం. నర్సు మాటలను నమ్మిన బాధితురాలు కన్నీటి పర్యంతమై మూడు రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయింది. కానీ ఐదు రోజుల తర్వాత ఓ వ్యక్తి ద్వారా తన పాప బతికే ఉందన్న సమాచారం ఫాతిమాకు చేరింది. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించి నర్సుపై ఫిర్యాదు చేసింది.
- ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శిశువును ఎవరికీ విక్రయించారు?, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు?, ఆసుపత్రి సిబ్బంది పాత్ర ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. పుట్టిన బిడ్డ కోసం తల్లి విలపిస్తుంటే, డబ్బుల కోసం పసికందును అమ్మేయడం అమానుషమని ప్రజలు మండిపడుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
