పటాన్చెరు,జూన్,14,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం ఎండనక, వాననక నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి నిజమైన సేవకులని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాపురం నరసింహారెడ్డి కొనియాడారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని ముత్తంగి డివిజన్ (265) పరిధిలోని వెలిమల, సందుగూడెం, వెలిమల తండా ప్రాంతాలకు చెందిన జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల కోసం ఆదివారం ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శాపురం నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా కార్మికులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “పరిశుభ్రమైన సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించే కార్మికుల సేవలు వెలకట్టలేనివి. వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన మరియు మహిళా నాయకులు, స్థానిక ప్రజలు మరియు పారిశుద్ధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
