MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 2:06 pm Digital Edition : SHIVA KUMAR

పాపన్నపేట-పిఎస్ ను,ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ.

ప్రతి రోజు సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహించాలి

గ్రామాల్లో నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలి

అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా

మెదక్,మే,15,మెదక్ టుడే న్యూస్:మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల స్థితి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది విధి నిర్వహణ తదితర అంశాలను సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. కేసుల దర్యాప్తులో వేగం పెంచి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, బాధితుల సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరిగేలా సేవాభావంతో విధులు నిర్వహించాలని సిబ్బందికి తెలిపారు.
గ్రామాల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, రాత్రి వేళల్లో పహారా నిర్వహణను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ప్రజల్లో భద్రతాభావం పెరిగేలా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం నిర్వహించాలని, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు, ఫేక్ వార్తలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీలో డీసీఆర్బి ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.