పాపన్నపేట,డిసెంబర్,10,న్యూస్:గురువారం జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పాక్షపాతంగా నిర్వహించేందుకు మెదక్ జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు వెల్లడించారు. ఎన్నికల పోలింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా,పూర్తిస్థాయి భద్రతా ప్రణాళికను రూపొందించి పటిష్ట బందోబస్తు అమలు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం పాపన్నపేట జడ్పీ పాఠశాల మైదానంలో పోలీస్ స్టేషన్లో పోలింగ్ బందోబస్తు,రూట్ మొబైల్ బందోబస్తు,పోలింగ్ స్టేషన్ భద్రత,సెక్టార్ మొబైల్,స్ట్రైకింగ్ ఫోర్స్ వంటి విభాగాల సిబ్బందికీ ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.ఈసందర్బంగా ఎస్పీ మాట్లాడారు. పోలీస్ సిబ్బంది చేపట్టాల్సిన బాధ్యతలు,అనుసరించాల్సిన విధి విధానాలు,తక్షణ స్పందన చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలను ఈ సమావేశంలో వివరించారు. ఎన్నికల సమయంలో చిన్న చిన్న వివాదాలే పెద్ద సంఘటనలకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే ముందస్తు భద్రతా చర్యలు తీసుకొని ప్రతి గ్రామంలో,ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. అధికారులు,సిబ్బంది అందరూ అప్పగించిన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వహించి,ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను విజయవంతం చేయాలని సూచించారు. ఎన్నికల పర్యవేక్షణ అధికారుల సమన్వయంతో వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో ఏ చిన్న ఉద్రిక్తత అనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకూ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు,ప్రదర్శనలు,బాణసంచా పేల్చడం వంటి కార్యకలాపాలకు పూర్తిగా నిషేధమని ఎస్పీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఐ లు రాజశేఖర్ రెడ్డి,వెంకటేశ్వర్లు,శైలెందర్, సందీప్ రెడ్డి,ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.