
పటాన్చెరు,మార్చి,12,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.పటాన్చెరు నియోజకవర్గ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి – యాదమ్మ దంపతుల సారధ్యంలో నిర్వహించిన ఈ భారీ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి కాట సునీత రాజు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గంలోని నలుమూలల నుండి తరలివచ్చిన వేలాది మంది మహిళలతో పటాన్చెరు ప్రాంతం ఒక చైతన్య వేదికగా మారింది.
అనంతరం ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి గూడెం యాదమ్మ మాట్లాడుతూ
మహిళా శక్తికి నిదర్శనంగా ఈ వేడుక నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇంటి బాధ్యతలతో పాటు సామాజిక బాధ్యతల్లోనూ మహిళలు చురుగ్గా పాల్గొనాలని, ప్రతి మహిళా ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ మహిళల కోసం కుట్టు మిషన్ల పంపిణీ, ఉపాధి శిక్షణ తరగతులు వంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని, మహిళా సంఘాల బలోపేతానికి తమ కుటుంబం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, నిరంతరం మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కాట సునీత రాజు గౌడ్ ప్రసంగిస్తూ
నేటి ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తూ అగ్రగామిగా నిలుస్తున్నారని కొనియాడారు. బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే మహిళలకు రాజకీయంగా, సామాజికంగా గొప్ప గౌరవం దక్కిందని, షీ టీమ్స్ వంటి వ్యవస్థల ద్వారా తెలంగాణలో మహిళలకు పూర్తి రక్షణ లభించిందని ఆమె గుర్తు చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు పేద తల్లుల జీవితాల్లో వెలుగులు నింపాయని, ఆడబిడ్డల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి కృషి అభినందనీయమని ప్రశంసించారు. నియోజకవర్గంలోని ప్రతి మహిళా సోదరి అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆమె భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో భాగంగా మహిళలకు నిర్వహించిన వివిధ క్రీడా మరియు సాంస్కృతిక పోటీలు సందడిగా సాగాయి. విజేతలకు శ్రీమతి గూడెం యాదమ్మ మరియు కాట సునీత రాజు గౌడ్ కలిసి బహుమతులు అందజేసి వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు మరియు పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.
