MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 6:36 am Digital Edition : puntikurad@gmail.com

నార్సింగి–పెద్ద శంకరంపేట రహదారి,రోడ్డెక్కాలంటేనే భయం!

నార్సింగి–పెద్ద శంకరంపేట రహదారి అధ్వానంగా.. నరకయాతన అనుభవిస్తున్న ప్రజలు వర్షం పడితే గుంతల్లో నీరు.. చిత్తడిగా మారుతున్న రోడ్డు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం,
మెదక్ టుడే న్యూస్ జులై 22 మెదక్ జిల్లారిపోర్టార్ పి. దుర్గేష్ గౌడ్ పాపన్నపేట మండలం నార్సింగి నుంచి పెద్ద శంకరంపేట వైపు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై అడుగడుగునా గుంతలు ఏర్పడి ఉండటంతో వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వర్షం కురిసిన సమయంలో గుంతల్లో నీరు చేరి రహదారి మొత్తం చిత్తడిగా మారడంతో రాకపోకలు మరింత కష్టతరంగా మారుతున్నాయి.ఈ రహదారి మీదుగా ప్రతిరోజూ నార్సింగి, పెద్ద శంకరంపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రహదారి పరిస్థితి అధ్వానంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గుంతలు కనిపించకపోవడంతో వాహనాలు అదుపుతప్పే ప్రమాదం కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని ప్రజలు వాపోతున్నారు. రహదారి మొత్తం బురదమయంగా మారడంతో వాహనాలు జారిపడే ప్రమాదం ఉందని, చిన్నపాటి వర్షానికే ప్రయాణం నరకప్రాయంగా మారుతోందని అంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లే రోగులు, గర్భిణులు, వృద్ధులు కూడా ఈ రహదారి పరిస్థితితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
ఇకనైనా అధికారులు స్పందించాలి
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నార్సింగి–పెద్ద శంకరంపేట రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. గుంతలను పూడ్చడంతో పాటు రహదారిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఇకనైనా ప్రత్యేక దృష్టి సారించి రహదారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.