రహదారి దుస్థితి..వర్షం వస్తే ప్రయాణం నరకప్రాయం
పాపన్నపేట,జూలై,22, (మెదక్ టుడే న్యూస్)
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నార్సింగి–పెద్ద శంకరంపేట ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షం పడినప్పుడు ఆ గుంతల్లో నీరు నిలిచి రహదారి మొత్తం బురదమయంగా మారుతోంది. దీంతో వాహనదారులు రహదారిపై ప్రయాణించడానికి భయపడుతున్నారు.ఈ రహదారిపై ప్రతిరోజూ నార్సింగి, పెద్ద శంకరంపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు ప్రయాణిస్తుంటారు. అయితే గుంతలు ఎక్కువగా ఉండటంతో ద్విచక్ర వాహనదారులు తరచూ జారిపడుతున్నారు. గుంతల్లో నీరు నిలవడంతో అవి కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. చిన్నపాటి వర్షానికే రహదారి మొత్తం చిత్తడిగా మారి వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లే రోగులు, గర్భిణులు, వృద్ధులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే మరమ్మతులు చేపట్టాలి,
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నార్సింగి–పెద్ద శంకరంపేట రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. గుంతలను పూడ్చి, రహదారిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.