జయలక్ష్మి నగర్, లక్ష్మి సాయి మెడోస్ కాలనీల్లో అధికారులతో కలిసి మాజీ వైస్ చైర్మన్ పర్యటన
దుర్వాసన, దోమల బెడదపై కాలనీవాసుల ఫిర్యాదుతో తక్షణ స్పందన

అమీన్పూర్,మార్చి,10,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ డివిజన్ జయలక్ష్మి నగర్, లక్ష్మి సాయి మెడోస్ కాలనీల గుండా వెళ్తున్న ప్రధాన మురుగునీటి కాలువ వల్ల వెలువడుతున్న దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ స్పష్టం చేశారు.
సమస్య తీవ్రతపై ప్రజల ఆవేదన:
గత కొద్దిరోజులుగా సదరు కాలనీల్లో కాలువను శుభ్రపరచకపోవడం వల్ల భరించలేని దుర్వాసన వెలువడుతోందని, దీనివల్ల ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దోమల ఉధృతి పెరిగి పిల్లలు, వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారని ఇటీవల నందారం నరసింహ గౌడ్ ని కలిసి మొరపెట్టుకున్నారు..
క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటన:
ప్రజల విన్నపంపై తక్షణమే స్పందించిన నరసింహ గౌడ్, అమీన్పూర్ మున్సిపాలిటీ డీఈ వెంకటరమణతో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి ఆయన స్వయంగా రెండు కాలనీల్లో పర్యటించారు. కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్ (మట్టి), చెత్తాచెదారం వల్ల నీరు నిలిచిపోయి దుర్వాసన వస్తున్న విషయాన్ని అధికారులకు క్షేత్రస్థాయిలో చూపించారు.
నందారం నరసింహ గౌడ్ మాట్లాడుతూ:
“కాలనీ ప్రజల ఆరోగ్యం మరియు పరిశుభ్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రధాన మురుగు కాలువను వెంటనే ప్రక్షాళన చేసి, నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించాము. అతి త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి, కాలనీవాసులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం.తమ సమస్యను విన్నవించిన వెంటనే స్పందించి, అధికారులతో కలిసి పరిష్కారం దిశగా కృషి చేస్తున్న నందారం నరసింహ గౌడ్ గారికి జయలక్ష్మి నగర్, లక్ష్మి సాయి మెడోస్ కాలనీ ప్రజలు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
