8 లక్షల మంది భక్తుల రాకతో పులకించిన అమీన్పూర్ – సమ్మక్క-సారక్కల ఆశీస్సులు అందరిపై ఉండాలి: ఆలయ చైర్మన్ నీలం బిక్షపతి
అమీన్పూర్,జనవరి,31,(మెదక్ టుడే) న్యూస్,ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలో ‘మినీ మేడారం’గా ప్రసిద్ధి చెందిన సమ్మక్క-సారలమ్మ జాతర శనివారం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ముగిసింది. నాలుగు రోజుల పాటు కన్నుల పండుగగా జరిగిన ఈ జాతరలో చివరి రోజైన నేడు అమ్మవార్లను వన ప్రవేశం చేయించడంతో జాతర వేడుకలు ముగిశాయని ఆలయ కమిటీ చైర్మన్ నీలం బిక్షపతి తెలిపారు.ఈ సందర్భంగా చైర్మన్ నీలం బిక్షపతి మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా అమీన్పూర్ సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద భక్తుల రద్దీ అశేషంగా ఉందని తెలిపారు. సుమారు 8 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని, నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చినా, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతరను వైభవంగా నిర్వహించామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.అన్ని శాఖల సహకారం అభినందనీయం:జాతర విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా:
పోలీస్ శాఖ: ట్రాఫిక్ మరియు భద్రత విషయంలో అహర్నిశలు శ్రమించినందుకు.జిహెచ్ఎంసి పారిశుధ్యం మరియు ఇతర మౌలిక వసతుల కల్పనకు.
ఎలక్ట్రికల్ & వాటర్ డిపార్ట్మెంట్స్: నిరంతర విద్యుత్ మరియు తాగునీటి సరఫరా అందించినందుకు.
ఈ జాతర మహోత్సవం ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి అమీన్పూర్ గ్రామ పెద్దలు, నియోజకవర్గ ప్రజలందరి సంపూర్ణ సహకారం ఉందని ఆయన కొనియాడారు.అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అందరినీ సమ్మక్క-సారలమ్మ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాస్త్రోక్తంగా అమ్మవార్లను తిరిగి వన ప్రవేశం చేయించాము. మళ్లీ రెండు సంవత్సరాల తర్వాత జరగబోయే మహా జాతరలో మళ్ళీ కలుసుకుందాం” అని నీలం బిక్షపతి ఈ సందర్భంగా భావోద్వేగంతో పలికారు.

